వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోటలో 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.
ఈమేరకు ఆయన రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ను హైదరాబాద్ లోని బిఆర్కే భవన్లో కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట, అడ్డాకుల, మూసాపేట, బూత్పూర్ మండలాలు జాతీయ రహదారిపై ఉన్నందున ప్రతిరోజు అనేక ప్రమాదాలు జరుగుతుంటాయని అయితే స్థానికంగా పెద్ద వైద్యశాల లేదని అన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రమే వుండి, అందుబాటులో 24 గంటల డ్యూటీ డాక్టర్లు లేనందున ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను మహబూబ్ నగర్ లేదా కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు.
గాయపడ్డ వారికి అత్యవసరమైన వైద్యం అందక అనేక మంది మృత్యువాత పడుతున్నారని, దీంతో వారి కుటుంబాలకు దిక్కులేకుండా పోతుందన్నారు.
ఈ విషయమై గతంలో ఎన్నోసార్లు జిల్లా అధికారులను సంప్రదించిన కూడా ప్రయోజనం లేకుండా పోయిందని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గంలోని ఇతర మండలాలకు కూడా అందుబాటులో ఉన్న కొత్తకోట పట్టణంలో ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అప్ గ్రేడ్ చేసి, 30 పడకల ఆసుపత్రిగా మార్చాలని, అదేవిధంగా నియోజకవర్గ కేంద్రమైన దేవరకద్రలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరారు.
దీనిపై స్పందించిన మంత్రి వీలైనంత త్వరగా కొత్తకోటలో 30 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
మంత్రిని కలిసిన వారిలో వాల్మీకి బోయ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మీనగ గోపి బోయ, ఎంపీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర కన్వీనర్ బి. కరుణాకర్,తెలుగు భాషా చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు పి.బడేసాబ్,ఆరె కటిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ ఉన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి