వంద శాతం గర్భిణీ స్త్రీల నమోదులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో స్త్రీ-శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖల సంయుక్త సమన్వయ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ప్రతి గర్భిణీ నమోదులు జరగాలని, వైద్య, ఆరోగ్య, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మధ్య సమన్వయం ఉండాలని, నమోదైన వివరాలు ఇరు శాఖలు సరిచూసుకోవాలని అన్నారు. గర్భిణీ స్త్రీల వైద్య పరీక్షలు సమయానుసారం జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. హిమోగ్లోబిన్ 8 శాతం కంటే తక్కువ ఉన్న గర్భిణీల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఐరన్, ఫోలిక్ మాత్రలు అందిస్తూ, పోషకాహారం తీసుకొనేలా అవగాహన కల్పించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ప్రతినెలా హిమోగ్లోబిన్ పరీక్షలు చేపట్టి, రక్తహీనత ఉన్న పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వయసుకు తగ్గ బరువులేని పిల్లలను గుర్తించి, తగుచర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. జిల్లాలో తీవ్రమైన పోషకాహారలోపం, మాధ్యమిక పోషకాహారలోపం ఉన్న పిల్లలకు తగిన వైద్య సహాయం అందించి, వారిని ఆరోగ్యవంతులుగా మార్చాలన్నారు. ఇరు శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, జిల్లా సంక్షేమ అధికారిణి సంధ్యారాణి, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు, ప్రాజెక్ట్ అధికారులు, సిడిపివో లు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
previous post