కరోనా నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలో ఒక అమానవీయ సంఘటన జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం పెదపేటలోని ఓ ఇంట్లో కుమారుడితో అద్దెకు ఉంటున్న మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది.
దాంతో ఆమె ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఆమె తో బాటే ఇన్ని రోజులూ ఆమె కుమారుడు కూడా ఉన్నాడు.
ఆ తర్వాత ఆమెకు ‘నెగిటివ్’ రావడంతో సోమవారం ఇంటికి పంపించారు. వారిద్దరూ ఇంటికి చేరుకోగానే ఆ ఇంటి యజమాని వారు తన ఇంట్లో ఉండేందుకు అభ్యంతర పెట్టాడు. “నీకు కరోనా లక్షణాలు ఉన్నాయి. మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు” అని కటువుగా చెప్పాడు.
తమకు మరో గత్యంతరం లేదని తల్లీకొడుకులు ప్రాధేయపడ్డారు. అయినా.. యజమాని కనికరం చూపలేదు. దీంతో వారు.. సమీపంలోని క్రైస్తవ శ్మశానం వాటికకు చేరుకుని, అక్కడి రేకుల షెడ్డులో కాలం గడిపారు.
విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ వీఎస్ వీరభద్రరావు రంగంలోకి దిగి.. తల్లీ కొడుకులను శ్మశానం నుంచి ఆటోలో తీసుకొచ్చి అద్దెకు ఉంటున్న ఇంటికి తరలించారు.
యజమానితో మాట్లాడి అవగాహన కల్పించడంతో తల్లీకొడుకులు ఊరడిల్లారు.