తబ్లిగీ జమాత్ కార్యకర్తలు హీరోలు అంటూ ట్వీట్ చేసిన కర్నాటక క్యాడర్ ఐఏఎస్ అధికారికి ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసింది. తబ్లిగీ జమాత్ ను హీరోలు అనడమే కాకుండా మీడియాను హ్యాష్ ట్యాగ్ గోడియా అంటూ దారుణంగా విమర్శించాడు కర్నాటక ఐఏఎస్ అధికారి మహ్మద్ మొహసిన్.
లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను తనిఖీ చేసి సస్పెన్షన్ కు గురైన మొహసిన్ ఇప్పుడు మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దేశంలో 1,500 కరోనా కేసులకు ప్రత్యక్షంగా కారణమైన తబ్లిగీ జమాత్ కార్యకర్తలు హీరోలు అంటూ ట్వీట్ చేయడం పై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. తబ్లిగీ జమాత్ కార్యకర్తలు కోవిడ్ 19 నుంచి కోలుకుని ప్లాజ్మా దానం చేస్తున్నారని, వారు దానం చేసిన ప్లాజ్మాతో కరోనా రోగులకు ప్రయోగాత్మకంగా చికిత్స చేస్తున్నారని అందువల్ల వారు హీరోలని ఆ ఐఏఎస్ అధికారి అంటున్నారు.
తబ్లిగీ జమాత్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన హ్యాష్ ట్యాగ్ గోడియా( మీడియా) ఇప్పుడు ఏమంటుందని ఆయన ప్రశ్న వేశారు. ఏప్రిల్ 27న అతను ఆ ట్విట్ చేయగా 30న రాష్ట్ర ప్రభుత్వం నోటీసు ఇచ్చింది. వారం రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆయనకు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు.