ఎన్టీఆర్ వీరాభిమాని మేడిశెట్టి సాయి మణికంఠ మృతిపై సందేహాలు, సమాచారం ఉంటే తమకు చెప్పాలని డిఎస్పీ కేవీ రమణ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రు శివారు కడలివారిపాలెంలో మేడిశెట్టి సాయి మణికంఠ అనే యువకుడు ఉరి వేసుకుని చనిపోయి ఉన్నట్లు తమ సిబ్బంది గుర్తించారని డిఎస్పి కెవి రమణ విలేకరులకు తెలిపారు.
డెడ్ బాడీని పరిశీలిస్తే జేబులో బ్లేడు, ఫోను ఉన్నాయి అన్నారు. బ్లేడుతో చేయి మణికట్టును కోసుకున్నట్లుగా ఉందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించామన్నారు. మృతుని వివరాలు సేకరిస్తే కాట్రేనికోన మండలం కుప్పిగుంటకు చెందిన వాడిగా చెప్పారు.
పదేళ్లుగా అతడి తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం తిరుపతిలో కూలి పని చేసుకుంటున్నారని చెప్పారు. అయితే యువకుడి మృతిపై ఎవరికైనా సందేహాలు ఉన్నా, సమాచారం ఉన్న తమకు తెలియజేయాలన్నారు. ఏదైనా సమాచారం ఇస్తే నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.