ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) గ్రూప్ ఉగ్రవాదుల్ని తమ పైకి భారత్ ఉసిగొల్పుతున్నదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.
తమ దేశంలో అస్ధిరత్వాన్ని సృష్టించేందుకు భారత్ అన్ని రకాల పన్నాగాలను పన్నుతున్నదని ఆయన అన్నారు. డిజిటల్ మీడియా పబ్లిషర్స్ తో ఆయన ఇష్టాగోష్టి చర్చ జరుపుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్ సహాయంతో ఐఎస్ ఉగ్రవాదులు బెలూచిస్తాన్ లోని షియా హజారా బొగ్గు గనుల యజమానులను హతమార్చారని ఆయన అన్నారు.
ఆఫ్ఘనిస్థాన్ లో తిష్ట వేసి ఉన్న ఉగ్రవాద ముఠాలు బెలూచిస్తాన్ లో భారత్ సాయంతో తీరని నష్టాన్ని చేకూరుస్తున్నాయని ఆయన అన్నారు.
షియా హజారా వర్గానికి చెందిన వారిని ఎక్కడ కనిపిస్తే అక్కడ హతమారుస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఐఎస్ఐ ఉగ్రవాదులకు, భారత్ కు ఉన్న సంబంధాలను తమ నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు తమకు తెలియచేస్తున్నాయని ఆయన అన్నారు.
కొన్ని చోట్ల షియాలను మరి కొన్ని చోట్ల సున్నీ ముస్లింలను హతమారుస్తూ పాకిస్తాన్ లో అస్థిరత్వాన్ని పెంచేందుకు భారత్ అన్ని రకాల చర్యలు చేపడుతున్నదని ఆయన ఆరోపించారు.