ప్రస్తుత పాకిస్తాన్ ప్రభుత్వం భారతదేశంతో “రహస్యంగా సంబంధాలు ఏర్పరుచుకుంటున్నది” అంటూ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఆజాద్ జమ్మూ కాశ్మీర్ ప్రధానమంత్రి సర్దార్ తన్వీర్ ఇలియాస్ ఆహ్వానం మేరకు ముజఫరాబాద్ వచ్చిన PTI చీఫ్, నగరం నడిబొడ్డున పెద్ద సంఖ్యలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఏప్రిల్లో అధికారం నుండి తొలగించబడిన తర్వాత ఇమ్రాన్ ఖాన్కి ఇది 52వ బహిరంగ సభ. కాశ్మీరీలు వారి నిరంతర స్వాతంత్ర్య పోరాటానికి ప్రతీకలని ఆయన అన్నారు. అయితే ఆ ప్రజల త్యాగాలను పూర్తిగా విస్మరిస్తూ “ఫాసిస్ట్ నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం” నిరంకుశ చర్యలకు పాల్పడుతున్నదని ఆయన అన్నారు. ఆగస్ట్ 5, 2019 న, ఆక్రమిత జమ్మూ మరియు కాశ్మీర్కు ప్రత్యేక హోదాను రద్దు చేసినప్పుడు, తన ప్రభుత్వం న్యూఢిల్లీతో అన్ని సంబంధాలను తెంచుకున్నదని ఆయన గుర్తు చేసుకున్నారు.
“ప్రతి దేశం వాణిజ్యం నుండి ప్రయోజనాలను పొందుతుందని మీకు బాగా తెలుసు. భారతదేశం ఒక పెద్ద దేశం మరియు దానితో వాణిజ్యం వల్ల పాకిస్తాన్ కూడా లాభపడి ఉండేది. కానీ కాశ్మీరీల స్వాతంత్య్ర ఉద్యమంలో మేము ఎప్పటికీ రాజీపడబోమని నా ప్రభుత్వం నిర్ణయించింది, ”అని ఆయన అన్నారు.
“ఆక్రమిత జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ తర్వాత మాత్రమే మేము భారతదేశంతో సంబంధాలను మళ్లీ కొనసాగించే వీలుందని కూడా మేం చెప్పాం’’ అని ఆయన అన్నారు. తన పిలుపుకు ప్రతిస్పందించడానికి తమను తాము సిద్ధం చేసుకోవాలని ఆయన ఆజాద్ కాశ్మీర్ ప్రజలను కోరారు. అందరూ తాను చేస్తున్న ఉద్యమంలో చేరాలని వారిని కోరారు.