భారత్ ఇప్పుడు ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందిందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2019లో కేంద్రంపై రుణభారం 48.7 శాతం తగ్గిందని, 284 బిలియన్ డాలర్ల స్థాయికి ఎఫ్డీఐలు చేరాయని ఆమె తెలిపారు. 2006-16 మధ్య పేదరికం నుంచి 22 కోట్ల మంది ప్రజలు బయటపడ్డారని ఆమె ప్రకటించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.
ఆర్థిక వ్యవస్థ మూలాల బలంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. దేశ ఆర్ధిక వ్యవస్థకు ఎలాంటి ప్రమాదం లేదని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదలందరికి ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని ఆమె తెలిపారు. యువత ను మరింత శక్తిమంతం చేసే విధంగా ప్రభుత్వ ప్రాధాన్యతలు ఉంటాయని మంత్రి తెలిపారు.
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపునకు కట్టుబడి ఉన్నాం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా 6.11 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెంచడంపై దృష్టి సారించాం. కృషి సించాయి యోజన ద్వారా సూక్ష్మ సాగునీటి విధానాలకు ప్రోత్సాహం కల్పిస్తున్నాం. గ్రామీణ సడక్ యోజన, ఆర్థిక సమ్మిళిత రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి అని కేంద్ర మంత్రి వివరించారు.
వర్షాభావ జిల్లాలకు అదనపు నిధులు సమకూరుస్తున్నట్లు నిర్మల తెలిపారు. అదే విధంగా రైతులకు 20 లక్షల సోలార్ పంపుసెట్లు పంపిణీ చేస్తామని ఆమె వెల్లడించారు. పొలాలు, రైతుల ఉత్పాదకత పెంచడం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని, కూరగాయలు పండ్లు పూల ఎగుమతుల సరఫరాకు కృషి ఉడాన్ యోజన ప్రవేశపెట్టామని ఆమె తెలిపారు.