భారతదేశాన్ని క్షిపణి దాడుల నుంచి రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు నిత్యం కృషి చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగా కొన్నేళ్ల క్రితం అత్యంత అధునాతన క్షిపణి వ్యవస్థ ఎస్-400 ట్రయాంఫ్ను రష్యా నుంచి దిగుమతి చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
అయితే తాజాగా రష్యా ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థను ఇండియాకు పంపిణీ చేసిందని నివేదికలు పేర్కొంటున్నాయి. భారత వైమానిక దళం ఇప్పటికే పంజాబ్ సెక్టార్లో మొదటి ఎస్-400 స్క్వాడ్రన్ బ్యాటరీలను రంగంలోకి దించిందని సమాచారం.
ఈ తొలిబ్యాచ్ స్క్వాడ్రన్ బ్యాటరీలు పాకిస్థాన్, చైనా నుంచి వచ్చే వైమానిక ముప్పులను ఎదుర్కోగలవని నివేదికలు చెబుతున్నాయి. మొదటి స్క్వాడ్రన్ డెలివరీలు ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయని అంచనా.
ప్రపంచంలోని అత్యంత అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలలో ఒకటిగా చెప్పుకునే ఎస్-400 వ్యవస్థకు డ్రోన్ల నుంచి బాలిస్టిక్ క్షిపణుల వరకు ప్రతిదానిని నిర్వీర్యం చేయగల సామర్థ్యం ఉంది.