జమ్ము కశ్మీర్ అంశంలో పాకిస్తాన్కు మద్దతుగా నిలుస్తామన్న టర్కీ అధ్యక్షుడు రెసీప్ తయీప్ ఎర్డోగన్ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత అంతర్గత వ్యవహారాల్లో ఎవరి జోక్యం సహించబోమని మరోసారి స్పష్టం చేసింది. శుక్రవారం నాటి పాక్ పర్యటనలో భాగంగా ఎర్డోగన్ జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కశ్మీర్ అంశంలో తాము ఎల్లప్పుడూ న్యాయం వైపే ఉంటామని.. అందుకే పాకిస్తాన్కు అండగా నిలుస్తున్నామన్నారు. ఎర్డోగన్ వ్యాఖ్యలపై స్పందించిన భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ మాట్లాడుతూ ‘‘భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని టర్కీ నాయకత్వానికి స్పష్టం చేస్తున్నాం. వాస్తవాలను అర్థం చేసుకుంటే బాగుంటుంది. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం కారణంగా భారత్, కశ్మీర్ ప్రాంతానికి పొంచి ఉన్న ప్రమాదం గురించి మీరు తెలుసుకోవాలి. జమ్మూ కశ్మీర్ విషయంలో ఇతరుల జోక్యాన్ని సహించం’’ అని స్పష్టం చేశారు.