ఎందరో మహానుభావులు వారి ధన, మాన, ప్రాణ త్యాగాల ఫలితమే మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం అని మాజీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
ఈ రోజు కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతీ 13, 14 వార్డుల్లో స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీజీ ఫొటోకి పూలమాలతో నివాళులు అర్పించిన ఆయన జాతీయ జెండా ఎగుర వేశారు.
ఈ సందర్బంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మనకు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్బంగా రాష్ట్ర, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.
మనకు ఉన్నంతలో తోటి వారికి సహాయపడుతూ, అందరూ కులమతాలకు అతీతంగా అన్నదమ్ముల వలే కలసి మెలసి ఉంటూ రాబోయే తరాలకు కూడా మన స్వాతంత్ర్యం గొప్పతనాన్ని చాటి చెప్పాలని ఆయన యువతరాన్ని కోరారు. అలాగే యువత మంచి మార్గంలో పయనిస్తూ దేశానికీ మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమం లో తెదేపా నాయకులు పొగిరి రాము, బూరెల నరేష్, మీసాల అప్పల నాయుడు, జగరోతు లక్ష్మణ, లంకె అప్పల నాయుడు, జంపన వీర శ్రీనివాస్, దుర్గా ప్రసాద్, బోనంగి సత్యం,డా. రాంబాబు, రాంమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.