మహిళల అభ్యున్నతికి సీఎం కే చంద్రశేఖర్రావు నేతృత్వంలో చేపడుతున్న పథకాలను ఖమ్మం టీఆర్ఎస్ నేతలు వినూత్నంగా ప్రదర్శించి ప్రశంసలు పొందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి అనేక పథకాలను కీర్తిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ జయహో.. అంటూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధ్వర్యంలో మమత వైద్య కళాశాల మైదానంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు, అడపడుచులు, టీఆర్ఎస్ శ్రేణులు హాజరవడంతో పండగ వాతావరణం చోటుచేసుకున్నది.
తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అద్భుతమైన సంక్షేమ, సంరక్షణ, అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవ సంబరాలు నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ వర్కంగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిన నేపధ్యంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా సీఎం కేసిఆర్ మహిళలకు లక్షా 116 రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్న విషయాన్ని ఖమ్మం మమత వైద్య కళాశాల మైదానంలో 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక లక్ష 116 గాజులతో సీఎం కేసిఆర్ భారీ చిత్రాన్ని రూపొందించారు. మహిళా బంధు కేసిఆర్ అంటూ పెద్దగా రాశారు . అలాగే మానవహారంగా చుట్టూ మహిళలు నిలబడి కేసీఆర్ జయహో, థాంక్యూ కేసీఆర్ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు.