తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు మంగళవారం నాడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య కి, రాష్ట్ర పౌర విమానయాన శాఖ మంత్రి వి.కె సింగ్ కి లేఖ రాశారు.
ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతి పట్టణానికి ప్రపంచ నలుమూలల నుంచి స్వామి దర్శనానికి విచ్చేస్తుంటారని, పర్యాటకులు ప్రస్తుతం ముంబై, బెంగళూరు, చెన్నై మరియు హైదరాబాద్ వంటి నగరాల విమానాశ్రయాలను ఆశ్రయించి అక్కడి నుంచి తిరుపతికి కష్ట సాధ్యమైన ప్రయాణం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
కడప, చిత్తూరు మరియు పొరుగు జిల్లాలలో అత్యధిక మంది జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లి వస్తుంటారని, వీరు కూడా సుదూర నగరాలైన చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాదు వంటి విమానాశ్రయాలకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. 2017లో తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపొందించినప్పటికీ అంతర్జాతీయంగా విమాన సర్వీసులు లేకపోవడం వలన విదేశీ పర్యాటకులతో పాటు స్వదేశీయులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని, పై విషయాలను సమగ్రంగా పరిశీలించి తిరుపతిలో అంతర్జాతీయ పౌర విమానయాన సర్వీసులు పునరుద్ధరించాలని ఈ లేఖలో పేర్కొన్నారు.