అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని హన్మకొండలోని స్వధార్ మహిళా ఆశ్రమంలో మహిళా సాధికారికత – మహిళా భ్రదత అనే అంశంపై అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనురాగ్ సొసైటీ ప్రెసిడెంట్ డా. కె.అనితారెడ్డి మాట్లాడుతూ మహిళలు ఇంకా స్వేచ్ఛగా తమ ఆలోచనలను ఆచరణలో పెట్టె స్థాయికి చేరలేకపోతున్నారని అన్నారు.
ఇంకా ధైర్యంగా అన్ని రంగాలల్లో మహిళలు పైకెదగాల్సి ఉందని అన్నారు. మహిళల భద్రత అయితే గాలిలో దీపంలా ఉందని అన్నారు. దేశంలో మహిళా భద్రతకు చట్టాలు ఉన్నప్పటికి మహిళలపై యథేచ్ఛగా దారుణాలు జరుగుతున్నాయని లైంగిక వేధింపులు, అక్రమ రవాణా వంటివి మహిళల పాలిట శాపాలుగా మారుతున్నాయని అన్నారు. చివరికి ఉద్యోగ ప్రదేశాలల్లో కూడా వేధింపులకు గురవుతున్నారని అన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు నిర్వహించడమంటే ఆ ఒక్కరోజు ఆకాశంలో సగం అంటు మహిళలని ఆకాశానికి ఎత్తే సభలు ఏర్పాటుచేసి శాలువాలు కప్పడం కాదని, మహిళలకు సరైన స్థానం కల్పిస్తూ, విద్య, అభివృద్ధి, న్యాయం, భద్రత, భరోసా, ధైర్యం అందిస్తూ మాటల్లో కాకుండా చేతల్లో సమానత్వం చూపినప్పుడె నిజమైన అంతర్జాతీయ మహిళ దినోత్సవం అని అనితారెడ్డి అన్నారు. హక్కులు అనేవి ఒక్కరు భిక్షగా ఇచ్చేవి కావని, అవి తమ సొంతం అని భావించాలని అన్నారు. తరువాత మహిళలతో ముఖాముఖి, ఇష్టాగోష్ఠి నిర్వహించి వారి వారి అభిప్రాయాలు తెలియజేశారు.