తిరుమల దర్శనార్థం వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ‘డిక్లరేషన్’ ఇవ్వాల్సిందేనని స్వామి పరిపూర్ణానంద అన్నారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి, ఆయన కు క్రైస్తవంపై నమ్మకం ఉంటే తిరుమల వెళ్లినప్పుడు అదే విషయం చెప్పాలని, డిక్లరేషన్ ఇచ్చి తిరుమల దేవుడిని దర్శించుకోవాలని ఆయన కోరారు.
ఇలా చేయడం వల్ల ఏపిజె అబ్దుల్ కలామ్ ను ఆదర్శంగా తీసుకున్నాడని మంచిగా చెప్పుకుంటారని లేకపోతే జరగాల్సింది జరుగుతుందని పరిపూర్ణానంద అన్నారు.
తిరుమలపై మంత్రి కొడాలి నాని చేసిన విపరీత వ్యాఖ్యలపై స్వామి పరిపూర్ణానంద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. మంత్రి నాని చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి జగన్కు వినిపిస్తున్నాయో? లేదో? తెలియదని అన్నారు.
స్పందించకపోతే సీఎం జగనే మాట్లాడించారని అనుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. తిరుమలలో 42 పాయింట్లతో డిక్లరేషన్ రూపొందించారని, ఇతర మతస్థులు దర్శనార్థం వెళితే కచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. కొడాలి నానీ భ్రమల నుంచి బయటికి రావాలని హెచ్చరించారు.
గతంలో ఓ పార్టీలో ఉండేవారని, ప్రస్తుతం మరో పార్టీలో ఉన్నారని, త్వరలో కొడాలి నానికి ఈ పార్టీపై ఉన్న భ్రమలు కూడా తొలిగిపోయి, ఇతర పార్టీలోకి వెళ్తారని స్వామీజీ ఎద్దేవా చేశారు. తిరుపతి ఎవడబ్బ సొత్తు అనడం చాలా దారుణమైన అంశమని, తిరుమల డిక్లరేషన్ పై ప్రశ్నించడం అహంకారమే అవుతుందని అన్నారు. దేవుళ్ల గురించి మాట్లాడే స్థాయి నానికి లేదని మండిపడ్డారు.
తిరుమల కొండతో పెట్టుకున్న వారి బూడిద కూడ దొరకలేదని, ఆ చరిత్ర కూడా కళ్లముందే ఉందని పేర్కొన్నారు.