ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు మార్చడం కాదు ఈ రాష్ట్రంలో ప్రజలు వైసిపి ప్రభుత్వాన్ని మార్చేస్తారని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. కేంద్రం ఏపీకి కేటాయించిన 25 లక్షలు ఇల్లు కట్టలేని అసమర్ధ ప్రభుత్వం నేడు రాష్టంలో పాలన చేస్తోందని ఆయన అన్నారు. వైసిపి ముఖ్యమంత్రి పేరున ఉన్న జగనన్న కాలనీలో ఎందుకు ఇళ్లు కట్టలేకపోయారుని ఆయన ప్రశ్నించారు.
సత్యసాయి జిల్లా పెనుగొండలో ఆర్డీవో కార్యాలయం ముందు పేదల ఇళ్లకు పెండిగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలని జగనన్న కాలనీలు ఇల్లునిర్మాణం పూర్తి చేయాలని, విద్యుత్ ఛార్జింగ్ తగ్గించాలని ప్రధాన డిమాండ్లతో బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆర్డీవో కార్యాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆర్డీవో కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గృహాల నిర్మాణానికి ఇవ్వాల్సిన నిధుల్లో అధిక భాగం కేంద్రం ఎప్పుడో రాష్ట్రానికి ఇచ్చేసింది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఏ జగనన్న కాలనీకి వెళ్లినా, పునాదులు, మొండిగోడలే దర్శనమిస్తున్నాయి. ఇళ్లు కట్టించేది కేంద్రమైతే, 22 లక్షల గృహాలు ఏపీ ప్రభుత్వమే కడుతుందని ప్రచారం చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటివరకూ పూర్తి చేసింది 6 లక్షల 15 వేల ఇళ్లేనని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఇంటికి స్లాబ్ వేసినవాటినీ పూర్తయిన ఇళ్ల జాబితాలో కలిపేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపై ఏపీ బీజేపీ పోరుబాట పట్టింది. నేడు రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయిని విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీలు 5 సార్లు ఎందుకు పేదలపై భారం మోపారో చెప్పాలన్నారు. కేంద్ర ఇచ్చే సహకారాన్ని సైతం వినియోగించుకోలేని అసమర్ధ ప్రభుత్వమని మండిపడ్డారు.
2024లో మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలను మీ మంత్రులకు టికెట్లు ఇవ్వడం లేదంటే పరోక్షంగా మీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఒప్పుకున్నట్టే కదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల విషయంలో వైసిపి ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు మార్చడం కాదు ఈ రాష్ట్రంలో ప్రజలు వైసిపి ప్రభుత్వాన్ని మార్చేస్తారన్నారు. సెంట్ స్థలాల పేరుతో పేదలకును మోసం చేశారని.. కేంద్రం ఇచ్చిన నిధులు కూడా దారి మళ్లించారని ఆయన అన్నారు.
ఈ ఆందోళన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి తో పాటు జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్ స్థానిక నాయకులు రామకృష్ణ మరియు జిల్లా నేత రామాంజనేయులు ఇతర నాయకులు పాల్గొన్నారు.