రానున్న ఎన్నికల్లో రాజంపేట నుండి రాజోలు వరకు పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేన అన్ని నియోజకవర్గాలు కైవసం చేసుకోనుందని అన్నమయ్య జిల్లా రాజంపేట జనసేన నేత ఎం.వెంకటేశ్వర రావు (ఏంవిఆర్),రిటైర్డ్ ఆర్టీసీ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు. రాజంపేట లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. రాజంపేట నియోజకవర్గంలో గత నాలుగున్నర ఏండ్లలో జరగని అభివృద్ధిని తమ హయాంలో ఎలా చేసి చూపుతామో ప్రజలకు వివరించనున్నామని తెలిపారు. రాజంపేట ప్రజల జీవనాధారమైన అన్నమయ్య ప్రాజెక్టు ను కొందరి స్వార్థం కోసం కూల్చివేశారని ,దానిని పునర్నిర్మించడం మా బాధ్యత అన్నారు.
పవన్ కళ్యాణ్ పలు సమావేశాల్లో అన్నమయ్య ప్రాజెక్టు గురించి ప్రస్తావించారని అన్నారు. రాజంపేటకు మెడికల్ కాలేజీ సాధించి తీరుతామన్నారు ,రాజంపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద చాలామంది ఆధారపడి ఉన్నారని అందువల్ల రాజంపేట విస్తరణ కోసం రింగ్ రోడ్ నిర్మిస్తామన్నారు.మున్సిపాలిటీ అభివృధ్దికి నిధులు తీసుకొస్తామన్నారు. జరికోన ప్రాజెక్ట్ నుండి సుండుపల్లి మండలానికి త్రాగు, సాగు నీరు అందిస్తామని,రాజంపేట నుండి వీరబల్లి, సుండుపల్లి వెళ్ళే రోడ్ల విస్తరణ చేస్తామని, మార్కెట్ యార్డ్ ని అభివృద్ధి చేసి రైతులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని తెలిపారు, రాజంపేట పట్టణంలోని మున్సిపల్ కూరగాయల మార్కెట్ ను అధునాతనంగా తీర్చిదిద్దుతామన్నారు, ఇలా రాజంపేట నియోజకవర్గ అభివృద్ధికి ఒక విజన్ రూపొందిస్తామన్నారు.