విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ ఈనెల 31న భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైంది. పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా జనసేన ఏర్పాటు చేసుకోవడంతో విశాఖలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద సభా వేదిక ఏర్పాటు చేయాలని ముందా జనసేన నిర్ణయించింది. అయితే సభావేదిక మార్చాలని పోలీసులు సూచించారు. పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా సభ అక్కడే జరిపితీరుతామని జనసేన శ్రేణులు కరపత్రాలు పంచారు. ఈ నేపథ్యంలో జనసేన సభకు పోలీసుల అనుమతి ఉంటుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది.
భాజపాతో మిత్రపక్షంగా జనసేన విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికుల ఆందోళనకు మద్దతివ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఈ నెల 31న విశాఖలో పర్యటించనున్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆహ్వానం మేరకు ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సభలో పాల్గొంటారు. తొలుత ఉక్కు కర్మాగారం ప్రాంగణానికి వెళ్లి పరిరక్షణ సమితి ప్రతినిధుల్ని కలిసి వారితో మాట్లాడుతారు. ‘‘విశాఖ ఉక్కు భావోద్వేగాలతో ముడిపడిన అంశమంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 9న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా దృష్టికి పవన్కల్యాణ్ తీసుకెళ్లారు. ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచించాలని కోరారు.
34మంది ప్రాణ త్యాగాలతో ఆ కర్మాగారం ఏర్పాటైందనే విషయాన్ని అమిత్షాకు వివరించారు’’ అని జనసేన పార్టీ తెలిపింది. కానీ, విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ దిశగానే అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం ఊపందుకుంది. పవన్ పర్యటనతో విశాఖ ఉక్కు ఉద్యమానికి మరింత బలం చేకూరుతుందని కార్మికులు భావిస్తున్నారు.