ఉపాధి హామీ పథకం అమలులో రాయచోటిని అగ్రస్థానంలో నిలబెట్టాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శనివారం రాయచోటి పట్టణంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల ఉపాధి హామీ సిబ్బంది, అధికారులు, ఎం పి డి ఓలతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి 2021-22 సంవత్సరానికి సంబంధించి పనుల ప్రణాలికలు, ఇతర పారామీటర్స్ పై నియోజక వర్గ స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ఎం ఎల్ సి జకియా ఖానంతో కలసి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రసుతం పథకం అమలవుతున్నవిధానాలను, పనుల కల్పనను, నిధుల వ్యయం పై అధికారులు వివరించారు.
ఉపాధిహామీని బలోపేతం చేయాలి
ఈ సందర్బంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ 2005లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ ఆర్ చేతుల మీదుగా అనంతపురంలో ఉపాధి హామీ పథకం ప్రారంభించామన్నారు. ఉపాధి హామీ పథకం నిధులు అన్నిశాఖలకు ఉపయోగపడిందన్నారు. పథకాన్ని దుర్వినియోగం చేయకుండా, సమన్వయంతో, బాధ్యతతో, అవినీతి అక్రమాలకు చోటివ్వకుండా పనిచేయాలన్నారు. క్షేత్ర స్థాయిలోనే ఉన్నతమైన ఆలోచనలు ఉండాలన్నారు. ఈ పథకాన్నిమరింత బలోపేతం చేయాలన్నారు.
25 లక్షల పనిదినాలు అభినందనీయం
సన్న, చిన్నకారు రైతులకు వై ఎస్ ఆర్ జలకళ ద్వారా ఉచిత బోర్లు, విద్యుత్, మోటార్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఉపాధి హామీ పనిదినాలును పెంచాలన్నారు. గత ఏడాదిలో నియోజక వర్గ వ్యాప్తంగా 20 లక్షల పనిదినాలు జరిగాయని, ఈ ఏడాదిలో ఇప్పటికే 25 లక్షల పనిదినాలు జరగడం అభినందనీయమన్నారు. అధికారులు పథకం పైన అవగాహన పెంపొందించుకుని బడ్జెట్ ఎంత, ఏయే పనులు ప్రతిపాదనలు చేయాలి తదితర అంశాలపై పక్కాగా ప్రణాళికలను రూపొందించు కోవాలన్నారు. కరోనా సమయంలో వేలాదిమందికి ఉపాధి కల్పించారని, మన నియోజక వర్గంలోనే ఒక్క రోజులోనే 54 వేల మందికి పనులు కల్పించడం అభినందనీయమన్నారు. బిల్లుల చెల్లింపుల విషయంలోనూ అధికారులు, సిబ్బంది కృషి అభినందనీయమన్నారు. గ్రామాలలో శాశ్వత నిర్మాణాలు గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ లు, పాల సేకరణ కేంద్రాల నిర్మాణాలును చేపడుతున్నారు. గత ప్రభుత్వంలో నీరు చెట్టు పథకంలో భారీగా అవినీతి జరిగిందన్నారు. సంపద తయారీ కేంద్రాల నిర్మాణాలు నేడు నిరుపయోగంగా మారాయన్నారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ఆశయ సాధనకు కృషి చేసి కూలీలకు అండగా నిలబడాలన్నారు.
అవినీతి, అక్రమాలకు తావీయకూడదు
ఎం ఎల్ సి జకియా ఖానం మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. అవినీతి, అక్రమాలు జరగకుండా చూడాలన్నారు. బిల్లుల చెల్లింపులలో జాప్యం వద్దన్నారు.
ఈ కార్యక్రమంలో డ్వామా పి డి యదుభూషన్ రెడ్డి, ఏ పి డి లు రవికుమార్, వై ఎస్ ఆర్ సి పి నాయకులు యదుభూషన్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, సిబ్యాల నారాయణరెడ్డి, మాజీ ఎం పి టి సి రామచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.