మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి జయసుధ నేడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. జయసుధ కుమారుడు నిహార్ కపూర్ వివాహం ఈ నెల 26న జరగబోతున్నది. దానికి సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని అందించేందుకు జయసుధ తన చెల్లెలు సుభాషిణితో కలిసి వెళ్లి చంద్రబాబునాయుడి ఇంటికి వెళ్లారు. నిహార్ కపూర్ వివాహం ఢిల్లీకి చెందిన అమ్రిత్ కౌర్ తో నిశ్చయమైంది. అమ్రిత్ కౌర్ న్యూఢిల్లీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ గా పని చేస్తున్నది.
జయసుధ చిన్న కుమారుడు శ్రేయాన్ కపూర్ సినీ నటుడు. జాతీయ స్థాయిలో షూటింగ్ ఈవెంట్ లలో పాల్గొంటారు కూడా. గతంలో శ్రేయాన్ బస్తీ అనే తెలుగు చిత్రంలో నటించాడు కానీ ఆ చిత్రం సక్సెస్ కాలేదు. దాంతో అతడు షూటర్ గానే తన కెరియర్ ను కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. జయసుధ భర్త నితిన్ కపూర్ సినీ నిర్మాత. 2017 లో ఆయన ముంబయిలో ఆత్మహత్య చేసుకున్నారు.