రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న గృహహక్కు పథకం గృహనిర్మాణ లబ్దిదారులకు ఎంతో ప్రయోజనకరమని, ఈ పథకం ద్వారా వారు తమ గ్రామంలోనే తమ పేరిట ఇంటి స్థలం రిజిష్టర్ చేసుకునే అవకాశం ఏర్పడుతుందని, దీనిని ఆయా లబ్దిదారులంతా వినియోగించుకునేలా లబ్దిదారులందరిలో అవగాహన కల్పించాలని గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు జాయింట్ కలెక్టర్(రెవిన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 10 వేలు చెల్లిస్తే సచివాలయ సిబ్బందే ఆ వ్యక్తి పేరిట స్థలాన్ని రిజిష్టర్ చేస్తారని పేర్కొన్నారు.
జాయింట్ కలెక్టర్(రెవిన్యూ) డా.కిషోర్ కుమార్ జిల్లాలోని డెంకాడ మండలంలో పర్యటించి పలు గ్రామ సచివాలయాలను తనిఖీ చేశారు. డెంకాడ మండల కేంద్రంలోను, శింగవరం, గంట్లాం, రఘుమండల్లో గ్రామ సచివాలయాలను తనిఖీ చేసి సిబ్బంది హాజరు, రికార్డులను పరిశీలించారు. ఓ.టి.ఎస్.పథకంపై గ్రామసభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నదీ లేనిదీ ఆరా తీశారు.
కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. సచివాలయంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారంతో కూడిన పోస్టర్లు, బ్యానర్లు ప్రజలందరికీ తెలిసేలా సరైన ప్రదేశంలో తగిన విధంగా ప్రదర్శిస్తున్నదీ లేనిదీ పరిశీలించారు. శింగవరంలో కరోనా పై అవగాహన కోసం ఉద్దేశించిన పోస్టర్లు వేలాడి వుండటంతో గుర్తించి వాటిని తానే స్వయంగా సరిచేసి గోడలకు అతికించారు. సచివాలయంలో ఏర్పాటు చేయాల్సిన పోస్టర్ల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శించడం పట్ల వారిని మందలించారు.
సచివాలయ సిబ్బంది చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించి ఈ వ్యవస్థకే మంచిపేరు తీసుకురావాలన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులై వుండి ఎవరైనా పొందలేనట్లయితే అలాంటి వారిని గుర్తించి అటువంటి వారితో ఆయా పథకాలకు దరఖాస్తు చేయించాలన్నారు. సచివాలయ స్థాయిలో వచ్చే ప్రజా సేవలకు సంబంధించిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో మండల తహశీల్దార్ ఆదిలక్ష్మి, ఎం.పి.డి.ఓ. స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.