కొల్లాపూర్ మండల పరిధిలోని చింతలపల్లి గ్రామ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. గ్రామాల్లో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు పలు ప్రజా సమస్యలపై కార్యకర్తలతో చర్చించారు. గత నాలుగు సంవత్సరాలు గా నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందనే చందంగా తయారైందని తమ హయాంలో మంజూరైన పనులనే మొదలెట్టక నిర్లక్ష్యం చేస్తూ కాలం గడుపుతున్నారని ఎన్నో హామిలిచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి ఏ ఒక్క హామీని నెరవేర్చలేక పోయారని మంజూరైన పనులను క్యాన్సిల్ చేయించారని కార్యకర్తలు వివరించారు.
వీటన్నింటినీ గ్రామాల్లో ప్రజలకు వివరించి చైతన్యం చేయాలని కార్యకర్తలకు జూపల్లి పిలుపునిచ్చారు.. అనంతరం గ్రామంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ మరియు చనిపోయిన కుటుంబాలను జూపల్లి పరామర్శించారు. మామిల్లపల్లి రామారావు అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకుని వారి కుటుంబాన్ని పరామర్శించారు. గత పదిరోజుల క్రితం తమ వ్యవసాయ పొలం లో మోటారు రిపేరు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి వంక పరశురాముడు మృతి చెందారు.
వారి దశదినకర్మ సందర్భంగా వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఆనారోగ్యంతో మృతి చెందిన అబ్దుల్లా మశయ్య కుటుంబాన్ని పరామర్శించారు. గత కొంతకాలంగా సులిగిరి శీను పక్షవాతంతో బాధపడుతున్న సందర్భంగా వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాలకు మనోధైర్యం కల్పించి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు గ్రామ నాయకులు జూపల్లి యువసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.