వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెంప పెట్టులాంటి తీర్పును మరో మారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు వెలువరించింది. పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్గా జస్టిస్ కనగరాజ్ నియామక జీవోను హైకోర్టు ఆరు వారాల పాటు సస్పెండ్ చేసింది.
జస్టిస్ కనగరాజ్ నియామకాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది పారా కిషోర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను, నియామకపు నిబంధనలను పాటించకుండా కనగరాజ్ ను నియమించారని పిటిషనర్ తరపు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు.
నిబంధనల ప్రకారం వయోపరిమితి వ్యత్యాసం ఉందని తెలిపారు. వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ప్రభుత్వ జీవోను ఆరు వారాల పాటు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పోలీసు ఫిర్యాదుల అథారటీ చైర్మన్గా మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.కనగరాజ్ను నియమించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. నియామకానికి సంబంధించి రాష్ట్ర హోంశాఖ ఈ ఏడాది జూన్ 20న జారీ చేసిన జీవో 57 ను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది పారా కిశోర్ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.