కరోనా కేసుల నమోదులో కామారెడ్డి జిల్లా డేంజర్ జోన్లోకి చేరుతోంది. జిల్లాలో రోజు రోజుకు కరోనా కేసులు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ప్రతి రోజు 20 కి పైగా కేసులు నమోదవుతున్నాయి. దాంతో జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు కరోనా తీవ్ర రూపం దాలుస్తుండటంతో అధికారుల్లో సైతం భయం నెలకొంటుంది.
కరోనా కట్టడికి ప్రజలు సహకరించక పోవడంతో అర్థం కాని స్థితిలో ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రజలు స్వీయ నిర్బంధం పాటిస్తే తప్ప కరోనా కట్టడి చేసే అవకాశాలు దాదాపు లేవని చెప్పవచ్చు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 451 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో అధికారులు, వైద్యులతో పాటు పోలీసులు కూడా ఉన్నారు. జిల్లా కేంద్రంలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.
విచ్చలవిడిగా రోడ్లపైకి జనాలు
ప్రజలు స్వీయ నిర్బంధం పాటించకపోవడం, విచ్చలవిడిగా తిరగడం వల్లనే కరోనా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే సామూహిక వ్యాప్తికి కరోనా చేరుకుందని కేంద్రం చెప్తోంది. ఈ సమయంలో ప్రజలు ఇళ్లను దాటి బయటకు వస్తే కరోనా కేసులు మరింత జఠిలం అయ్యే అవకాశాలున్నాయి. నేడు సాయంత్రం 7 గంటల వరకు జిల్లాలో 75 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఉన్నవాటితో చూస్తే జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 455 కి చేరింది.
స్వచ్చంద లాక్ డౌన్ లో వ్యాపారులు, ఆలయాల మూసివేత
జిల్లా కేంద్రంలో కరోనా కేసులు తీవ్రం అవుతుండటంతో సోమవారం నుంచి కిరాణా దుకాణాలు, నేటి నుంచి స్టీల్ మర్చంట్ వ్యాపారులు దుకాణాలు పూర్తిగా మూసివేశారు. మిగతా దుకాణ దారులు కూడా కొద్దీ రోజుల పాటు ఇదే విధానాన్ని కొనసాగిస్తే జనాల రాకపోకలు తగ్గే అవకాశం ఉంది.
అలాగే జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయం ఈ నెల 17 వ తేదీ నుంచి ఈ 31 వరకు మూసివేయడం జరుగుతుందని ఆలయ కమిటీ ప్రకటించింది. అలాగే అయ్యప్ప ఆలయం కూడా నేటి నుంచి ఆగస్ట్ 15 వరకు పూర్తిగా మూసివేయడం జరుగుతుందని ప్రకటించారు. ఈ రెండు ఆలయాలలో ఉదయం, సాయంకాలం జరిగే సాధారణ పూజలు కొనసాగుతాయని వెల్లడించారు.
లాక్ డౌన్ విధిస్తేనే కరోనా కట్టడి
గతంలో మాదిరిగా జిల్లాలో పూర్తి స్థాయి లాక్ డౌన్ ప్రకటిస్తేనే కరోనా కట్టడి చేయవచ్చు. స్వచ్చంద లాక్ డౌన్ కు మించి కరోనా కట్టడికి మార్గాలు కనపడటం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు శాంపిల్స్ ఇవ్వడానికి వస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటంతో వైద్యులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. మొత్తం మీద కామారెడ్డి జిల్లాలో కరోనా కేసులు మరింతగా వ్యాప్తి చెందే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి