తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీర్పేట హెచ్ బీ కాలనీ కార్పొరేటర్ జెర్రీపోతుల ప్రభుదాస్ పిలుపునిచ్చారు. మంగళవారం మీర్పేట్ హెచ్ బీ కాలని డివిజన్ వార్డు కార్యాలయంలో నిర్వహణ ఏర్పాట్లను కార్పొరేటర్ ప్రభుదాస్ కాప్రా డీసీ శంకర్ , వైద్య బృందంతో కలసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ డివిజన్ వార్డు కార్యాలయంలో ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న కంటి వెలుగు పరీక్షల ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ, వైద్యఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుదాస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆరోగ్యం దృష్ట్యా కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న పేదలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలను ఇవ్వనున్నట్లు తెలిపారు.
మొదటి విడత కంటి వెలుగుకు మంచి స్పందన లభించిందని, రెండో విడత కంటి వెలుగు కోసం అందరు కలిసి విజయవంతం చేయాలనీ అన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కండ్ల అద్దాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీసీ శంకర్, వైద్య బృందంతో పాటు స్థానిక నాయకులు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సత్యంన్యూస్, మేడ్చల్ జిల్లా