కరీంనగర్ అభివృద్దే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లోని 18వ డివిజన్ లోని రేకుర్తి వెంకటేశ్వర కాలనీలో రూ.1.90 కోట్ల పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించిన మంత్రికి డివిజన్ వాసులు శాలువాతో సత్కరించారు.
ఈ సందర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణలో కరీంనగర్ ను రాష్ట్రంలో రెండో నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. నగర పాలక సంస్థలో విలీనమైన డివిజన్ల అభివృద్ధికి కృషి చేస్తుందని వెల్లడించారు. రేకుర్తి గ్రామ పంచాయితీగా ఉన్నప్పుడు అభివృద్ధికి నోచుకోలేదన్నారు.
రేకుర్తి 18, 19 డివిజన్ల అభివృద్ధికి అత్యధికంగా నిధులు కేటాయించామని తెలిపారు. పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. పనులన్నీ నెల రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.