ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రత లు పూర్తిగా లోపించాయని, ప్రతిపక్ష నేతల ఇళ్ళ మీద దాడులు చేయడం, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయడం అత్యంత హేయం అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు, మాజీ శాసనసభ్యరాలు కాట్రగడ్డ ప్రసూన పేర్కొన్నారు.
చంద్రబాబు ఇంటి మీదకు కూడా ఇటీవల ఇదే తరహా దాడికి యత్నించడం చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఏంటో స్పష్టం అవుతోంది అని కాట్రగడ్డ ప్రసూన అన్నారు. ఇంత మంది గుంపులు గుమిగూడి దాడులకు బయలుదేరుతున్నా పోలీస్ వారికి ముందస్తు సమాచారం లేకపోవడం చూస్తుంటే రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆమె అన్నారు.
ప్రశ్నిస్తే దాడులకు తెగబడటం, అక్రమ కేసులు బనాయించడం ప్రతిపక్ష నేతల గొంతును బలవంతంగా నొక్కే ప్రయత్నం జరుగుతున్నదని కాట్రగడ్డ ప్రసూన అన్నారు. రాష్ట్రంలో ఈ వరుస ఘటనలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే ప్రమాదం ఉందని ఆమె అన్నారు.
రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల మీద నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇటువంటి దాడులకు తెగబడుతున్నారు అనిపిస్తోందని ఆమె తెలిపారు. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం , రాష్ట్ర గవర్నర్ రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలను పరిశీలించి దిద్దుబాటు చర్యలు చేయకపోతే రాష్ట్రం రావణకాష్టం కాకతప్పదు అని కాట్రగడ్డ ప్రసున పేర్కొన్నారు.