కెసిఆర్ రైతులను దగా, మోసం చేస్తున్నారని మిరియాల శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. పంట రుణమాఫీ పేరుతో యావత్ తెలంగాణ రైతాంగాన్ని దగా ,మోసం చేశారని జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మిర్యాల శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకలక్ష లోపు ఉన్న రైతుల పంట రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల ప్రచారంలో, శాసనసభలో ప్రకటించి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ అమలకు నోచుకోక కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మరికొన్ని రైతుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2018 ఏప్రిల్ 1న రుణమాఫీకి కటాఫ్ విధించిన విధి విధానాలను ఖరారు చేసేందుకు 15 నెలలు సమయం తీసుకొని 2020 మార్చి17 న జీవో విడుదల చేశారని, రాష్ట్రంలో మొత్తంగా 47. 40 లక్షల మంది రైతులకు సంబంధించిన 24 738 కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా నేటికీ సగం మందికి కూడా రుణమాఫీ పూర్తి కాలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. పేరుకు మాత్రం బడ్జెట్లో నిధులు కేటాయించినట్లుగా పద్దుల్లో చూపిస్తూ వాస్తవంగా మాత్రం అందుకు విరుద్ధంగా తెలంగాణ రైతాంగాన్ని మభ్యపెట్టి నట్టేట ముంచిన మోసకారి ప్రభుత్వం ఈ ప్రభుత్వమని ,రుణమాఫీ పేరుతో రైతాంగాన్ని నట్టేట ముంచిన ఘనత కేసీఆర్ దేనని దుయ్యబట్టారు.
నాలుగేళ్లలో జరిగిన రుణమాఫీ కేవలం 763 కోట్లు మాత్రమేనని తెలిపారు. మిగతా రైతులకు రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకు రుణాల్లో వారి పేర్లు మొండి బకాయి దారులుగా మిగిలిపోతున్నారని కొత్త రుణాలకు అవకాశం లేకుండా, పరువు పోయి, కుటుంబ బాధ్యతలు తాళలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారివి ఆత్మహత్యలు కావు కేసీఆర్ చేస్తున్న హత్యలే అని అన్నారు. వ్యవసాయ రంగంలో వరి వేస్తే ఊరే అని పేర్కొంటూ ప్రత్యామ్నాయ పంటలకు వివిధ విత్తనాలు అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం ఉంచకుండా వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బ్యాంకు ఖాతాల్లో రైతులను మొండి బాకీలుగా వారి పేర్లు నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే రుణమాఫీ నిధులను విడుదల చేయాలని రైతు పండించిన పంటలను చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని ఆయన తెలియజేశారు.