హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ప్రాంతాన్ని అధికారులు క్వారంటైన్ చేస్తున్నారు. 10 జెట్ మిషన్లు, 18 ఏయిర్ టెక్ మిషన్ల సాయంతో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నారు. తెలంగాణలో కరోనా వ్యాధితో తొలి మృతి హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ప్రాంతంలో నమోదు అయిన విషయం తెలిసిందే.
దాంతో ఈ ప్రాంతాన్ని అధికారులు జల్లెడ పడుతున్నారు. ఓ వృద్ధుడు మరణించిన తరువాత అతని రక్త నమూనాల్లో కరోనా వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో వైద్యాధికారులు, శానిటేషన్ సిబ్బంది, ఇతర అధికారులతో అతను నివాసం ఉంటున్న ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్, ఇందిరానగర్ లో పర్యటించారు.
మృతుడి కుటుంబీకులు, వారు కలిసిన వారందరిలో సుమారు 200 మంది బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారు. ప్రజల్లో ఆందోళన పెరగకుండా చూసేందుకే ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఎవరైనా ఇటీవలి కాలంలో విదేశాలకు వెళ్లి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
మొత్తం ప్రస్తుతం సిటీలో దాదాపు 18 వేల మంది విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారని, ఖైరతాబాద్ పరిధిలో 2500 మంది ఉన్నారని వెల్లడించారు. వీరందరినీ ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉంచామని, దుకాణాదారులు తగు జాగ్రత్తలు తీసుకుని వ్యాపారాలు చేసుకోవాలని తెలిపారు.