భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్, ఇండియన్ డెఫిలింపియన్ టెన్నిస్ ప్లేయర్ షేక్ జాఫ్రిన్ను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిని కిడాంబి శ్రీకాంత్, షేక్ జాఫ్రిన్ కలిశారు. ఇటీవల బ్యాంకాక్లో జరిగిన ప్రతిష్టాత్మక థామస్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన షట్లర్ కిడాంబి శ్రీకాంత్ను సీఎం అభినందించారు.
బదిరుల ఒలంపిక్ క్రీడల్లో (డెఫిలింపిక్స్–2022) కర్నూలుకు చెందిన టెన్నిస్ ప్లేయర్ షేక్ జాఫ్రిన్ కాంస్య పతకం సాధించారు. అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను చాటడంపై సీఎం జగన్ జాఫ్రిన్ను ప్రశంసించారు. షేక్ జాఫ్రిన్ అర్హతలను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తమ ప్రతిభను చాటిన ఏపీ క్రీడాకారులకు ఇచ్చే నగదు ప్రోత్సాహకం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాంత్, జాఫ్రిన్ను సీఎం ఈ సందర్భంగా సన్మానించారు. ప్రభుత్వం తరపున వారికవసరమైన అన్ని సౌకర్యాలు, ఏర్పాట్లు అందుబాటులో ఉంచాలని సీఎంవో అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్న సీఎం, రాబోయే రోజుల్లో ఇదే స్ధాయిలో ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరపున సీఎం జగన్కు ఏపీబీఏ ప్రెసిడెంట్ ముక్కాల ద్వారకానాథ్ బ్యాడ్మింటన్ కిట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో టూరిజం, క్రీడలశాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి, శ్రీకాంత్ తల్లిదండ్రులు రాధాముకుంద, కేవీఎస్ కృష్ణ, షేక్ జాఫ్రిన్ తండ్రి షేక్ జకీర్ అహ్మద్, శాప్ స్పోర్ట్స్ ఆఫీసర్ జూన్ గ్యాలియట్, శాప్ సిబ్బంది పాల్గొన్నారు.