గజ్వేల్లో దారుణ హత్యకు గురైన యువతి దివ్య కేసులో నిందితుడు వెంకటేష్ లొంగిపోయాడు. నేనే హత్య చేశా. చంపేశా అంటూ ఎంతో ఉత్సాహంగా వెంకటేష్ కొద్ది పేపటి కిందట వేములవాడ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. దివ్య హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయని పూర్తి కథానాన్ని కొద్ది సేపటి కిందట సత్యం న్యూస్ వెల్లడించిన విషయం తెలిసిందే.
ఈ హత్యకు పాల్పడినట్లు వేములవాడకు చెందిన వెంకటేష్ తనంత తానే అంగీకరించారు. అంతే కాకుండా దివ్యను చంపిన కత్తిని కూడా తీసుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. దివ్యతో వెంకటేశ్ కు మూడేళ్ల క్రితమే ప్రేమ వివాహం జరిగింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో వెంకటేష్ తల్లిదండ్రులు ఈ పెళ్లిని అంగీకరించక లేదు.
దాంతో వారిద్దరూ వేరైపోయారు. పెళ్లి సమయంలో దివ్య మేజర్ కాకపోవడంతో ఆమెను తల్లిదండ్రులు హాస్టల్లో ఉంచి చదించారు. ఈ నేపథ్యంలో పలుమార్లు దివ్యను వెంకటేష్ వేధించాడని, చివరకు ఈ వ్యవహారం పంచాయితీ వరకూ వెళ్లిందని తెలిసింది. పంచాయితీలో మందలించడంతో దీంతో దివ్య జోలికి రానంటూ వెంకటేష్ హామీ పత్రం రాసిచ్చినట్లు స్థానికులు తెలిపారు.
ఆ తర్వాత దివ్యకు గజ్వేల్లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ)లో ఫీల్డ్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది. తల్లిదండ్రులు ఆమెకు వరంగల్కు చెందిన సందీప్ అనే యువకుడితో వివాహం కుదిర్చారు. ఈనెల 26న వారి పెళ్లి జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దివ్యకు బ్యాంక్ ఉద్యోగం రావడంతో పాటు, మరో వ్యక్తితో వివాహం నిశ్చయం కావడంతో కసి పెంచుకున్న వెంకటేష్ ఈ ఘోరానికి పాల్పడి వుంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వారి అనుమానమే నిజమైంది. వేములవాడ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది అంతా శివరాత్రి బందోబస్తు డ్యూటీలో ఊపిరి సలపని పని లో ఉండగా వెంకటేష్ వచ్చి నేనే చంపా అంటూ కేకలు వేయడంతో పోలీసులే నిర్ఘాంత పోయారు. వెంకటేష్ ను తక్షణమే సిరిసిల్ల ఎస్ పి కార్యాలయానికి పంపించారు. అక్కడ వారు అన్ని లాంఛనాలను పూర్తి చేసి గజ్వేల్ పోలీసులకు అప్పగించే అవకాశం ఉంది.