అందరి సహకారంతో విజయనగరం పైడితల్లమ్మవారి జాతర మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి వెల్లడించారు. డిప్యూటీ స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా పైడితల్లి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామికి వేద పండితుల మంత్రోచ్ఛరణల పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు పరివేష్టాన్ని ధరింపజేసి వేదాశీర్వాదాలను అందించారు. అనంతరం కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కన్యకా పరమేశ్వరి ఆలయం చైర్మన్ నారాయణ శ్రీనివాస్ తదితరులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కోలగట్ల దంపతులను ఉచిత రీతిన సత్కరించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 10, 11 తేదీలలో జరగనున్న పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. జాతరలో ప్రధాన ఘట్టమైన సిరిమాను ఈ ఏడాది జిల్లాలో ని గంట్యాడ మండలం సిరిపురం లో సాక్షాత్కరించిందన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు.
అయితే బుధవారం సిరిమాను చెట్టుకు గొడ్డలిని తాకించే పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. అక్కడి నుండి సిరిమాను చెట్టును హుకుంపేటకు తరలించి జాతరకు సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. రెండేళ్లపాటు కరోనా మహమ్మారి నేపథ్యంలో సిరిమానోత్సవం జరిగినప్పటికీ భక్తులకు సిరిమాను తిలకించే భాగ్యాన్ని కల్పించే లేకపోవడం అయినదని అన్నారు.
ఈ నేపథ్యంలో అందరి భాగస్వామ్యంతో సిరిమానోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో సుపరిపాలన అందిస్తున్న సీఎం జగన్ కి మరింత శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని కోరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పైడి తల్లి అమ్మవారి పాలకమండలి సభ్యులు, కన్యకా పరమేశ్వరి దేవస్థానం పాలకమండలి సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.