నల్లమల్ల పరిధిలోని నిరుపేద చెంచు కుటుంబాలకు టీఎన్జీవో కొల్లాపూర్ యూనిట్ సభ్యులు అండగా నిలిచారు. కరోనా వైరస్ వ్యాధి వ్యాపించడం వలన ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. ఈ తరుణంలో రెక్కాడితే గానీ డొక్కాడని ప్రజల పరిస్థితి దారుణంగా మారింది. మారుమూల చెంచు ప్రజల పరిస్థితి పూటగడవడం కష్టం అయింది.
ఈ సందర్భంగా సోమవారం కొల్లాపూర్ మండల మొల్ల చింతపల్లి గ్రామ సమీపంలోని రేషన్ కార్డు లేని చెంచుగూడెం ప్రజలకు టీఎన్జీవో కొల్లాపూర్ యూనిట్ సభ్యులు నిత్యావసరాల సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి హాజరయ్యారు.
విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవడం హర్షణీయం
కరోనా విపత్కార పరిస్థితులలో నిరుపేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ఉన్నదాంట్లో తోటివారికి సహాయం చేయాలనే ఆలోచనతో టీఎన్జీవో కొల్లాపూర్ యూనిట్ ఉద్యోగులు ముందుకు రావడం చాలా గర్వ కారణంగా ఉందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.
ఒక్కొక్క కుటుంబానికి 12 కేజీల బియ్యం తో పాటు కిరాణా సామాగ్రి కిట్ అందించి తమ ఉదారతను చాటుకున్న ఉద్యోగులకు ధన్యవాదాలు తెలియజేశారు. నిరుపేదలకు నిరాశ్రయులకు, మనసున్న మానవతా దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయాన్ని అందించాలని పిలుపునిచ్చారు.
టీఎన్జీవో కొల్లాపూర్ యూనిట్ ఉద్యోగుల సేవ అనితర సాధ్యం
మనం జీవించడం కాదు. మనతోపాటు జీవిస్తున్న వారు ఆపదలో ఉన్నపుడు ఆదుకోవడమే మానవత్వానికి నిజమైన నిదర్శనమని ఈ అంశాన్ని టీఎన్జీవో కొల్లాపూర్ యూనిట్ ఉద్యోగులు నిరూపించారన్నారు. కరోనా మహమ్మారి కట్టడికి ఒక్కటే మార్గమని ప్రజలంతా మాస్కూలు తప్పకుండా ధరించాలన్నారు.
సామాజిక దూరం పాటించి కరోనా వ్యాధిని తరిమి కొట్టాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. కొల్లాపూర్ టీఎన్జీవో ఉద్యోగుల సొంత డబ్బుతో కార్యక్రమం చేపట్టామని నసీరుద్దీన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు భవాండ్ల వెంకటేష్ పాల్గొన్నారు.
ఇంకా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, కోశాధికారి శర్ఫా దీన్, అసోసియేట్ ప్రెసిడెంట్ పసుల సత్యనారాయణ యాదవ్, టీఎన్జీవో కొల్లాపూర్ యూనిట్ అధ్యక్షులు నసీరుద్దీన్ కార్యదర్శి జి కె.వెంకటేష్, టీఎన్జీవో జిల్లా సభ్యులు సంజీవ్, రామ్మోహన్, సురేందర్, రమేష్ గణేష్ ఉద్యోగులు పాల్గొన్నారు.