పోతిరెడ్డిపాడు వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణ సిఎం కేసీఆర్ కొండపోచమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారని భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. ఆంధ్రా ప్రభుత్వం జీవో 203 విడుదల చేసి కృష్ణ నీటిని దోచుకుంటుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్లు మూసుకుని కూర్చున్నారని ఆయన అన్నారు.
నల్లగొండ ఆర్ అండ్ బి లో నేడు ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న విస్తరణ పనులు తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంతో నాగార్జునసాగర్ కు చుక్క నీరు రాదని, వైఎస్ జగన్ తో కలిసి కేసీఆర్ దక్షిణ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు.
కొండపోచమ్మ ప్రాజెక్టుతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఏడారిగా మారుతుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కొండపోచమ్మ ప్రాజెక్టు కోసం గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లను పక్కన పెట్టారని ఆయన విమర్శించారు. ఎస్ఎల్బీసీ సొరంగమార్గానికి వెయ్యి కోట్లు ఇస్తే పూర్తి అయ్యేది కానీ ఇవ్వడం లేదు అని ఆయన అన్నారు.
నిధులు కేసీఆర్ కుటుంబానికి, నీళ్లు ఆంధ్ర ప్రాంతానికి పోతున్నాయని ఆయన విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య ,ఎంపీపీ మనీమద్దె సుమన్, ఎంపీటీసీ చింత యాదగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పుల రవి తదితరులు పాల్గొన్నారు.