ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విచారణ త్వరగా పూర్తి చేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
జగన్ మోహన్ రెడ్డిపై 11 సీబీఐ కేసులు 6 ఈ డీ కేసులు 2011 నుంచి ట్రయల్ లో ఉన్నాయి. అయితే ఈ కేసుల్లో ఇప్పటి వరకూ అభియోగాలు నమోదు చేయలేదు. ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసులను త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా జగన్ కేసులపై పురోగతి కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక వ్యక్తి కేసులో 78 వాయిదాలు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు ఇటీవల తప్పు పట్టింది. అయితే జగన్ కేసుకు సంబంధించి ఇప్పటికే 2200కు పైగా వాయిదాలు ఇచ్చారు.
ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా జరుగుతున్నదని రఘురామకృష్ణంరాజు తన పిటిషన్ లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను స్వీకరించి విచారణ చేపడితే జగన్ మోహన్ రెడ్డికి కష్టాలు ప్రారంభం అయినట్లే లెక్కవేసుకోవాలి.