కోనేరు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికీ ముఖ్య అతిధిగా జిల్లా ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ ఆదిలాబాద్ మున్సిపల్ కమీషనర్ జోగు ప్రేమేందర్ ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
తన ఊపిరి ఉన్నంతవరకు నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తానని కోనేరు కోనప్ప తెలిపారు. ప్రజలకు సేవ చేసుకోవటమే తన ధ్యేయమని మూడు సార్లు తనను ఎమ్మెల్యే గా గెలిపించిన ఈ ప్రజలకు ఎంతో రుణపడి ఉంటానని తెలిపారు. కాగజ్ నగర్ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల ప్రజలు పనుల మీద కాగజ్ నగర్ వస్తుంటారని వారందరి ఆకలి తీర్చటానికే ఈ కార్యక్రమం ప్రారంభించామని ఎమ్మెల్యే తెలిపారు.
సొంత ఆస్తులలో కొన్ని ట్రస్టుకు ఇచ్చేస్తా
అలాగే ఆసుపత్రులకు వైద్యం కోసం వచ్చే రోగులకు వారి వెంట వచ్చే వారు ఎవరైనా ఉంటే తమకు ముందు తెలిపితే వారికి నేరుగా ఆసుపత్రికే భోజనం పంపిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. తనకున్న కొన్ని ఆస్తులను కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేరు ఛారిటబుల్ ట్రస్ట్ కు ఇవ్వనున్నట్లు తెలిపారు.
సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ఆదర్శనీయమని ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు ఆత్రం సక్కు ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నారని మళ్లీ ఇంతటి మహోత్తరమైన కార్యక్రమం నిర్వహించడం గర్హనీయమని వారు తెలిపారు.
కేసీఆర్ ఆశీస్సులు ఉన్నంత కాలం చేస్తా
త్వరలోనే నియోజకవర్గంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ఆలోచన చేస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. పైన దేవుని ఆశీస్సులు క్రింద కెసిఆర్ అండదండలు ఉన్నంత కాలం సేవాకార్యక్రమాలు చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. కాగజ్ నగర్ పట్టణంలో ఎమ్మెల్యే కోనప్ప నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమానికి పలువురు దాతలు సహాయ సహకారాలు అందజేస్తున్నారు.
ఈ మహోత్తర కార్యక్రమానికి దాతల సహాయ సహకారాలు మరువలేనివని ఎమ్మెల్యే తెలిపారు. కోనేరు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమంలో దాతలు చేస్తున్న సహాయ సహకారాలను ప్రతీ నెల తహశీల్దార్ కార్యాలయంలో తెలియజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.