జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరు చాలా విడ్డూరంగా ఉందని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక బక్క జీవి అయిన కేసీఆర్ను కొట్టడానికి ఇంతమంది కేంద్రమంత్రులు రావాలా? అని సీఎం ప్రశ్నించారు. కేసీఆర్ మాటలు వింటుంటే… ప్రపంచాన్నికుదిపేస్తున్నమహమ్మారి కరోనా వైరస్ కూడా, కంటికి కనిపించని చిన్నసూక్ష్మజీవినైన నన్నునివారించడానికి ప్రపంచంలోని ఇన్ని దేశాలు కలిసి పోరాడటం సమంజసమేనా? అని అడిగితే ఎలా ఉంటుందో? తెలంగాణకు కరోనా కంటే ప్రమాదకరంగా మారిన కేసీఆర్ కుటుంబాన్నిగద్దె దించడానికి చేసే ప్రయత్నాలను ఆయన తప్పుపట్టడం కూడా అదే విధంగా ఉంది. ఒక దుష్టశక్తిని తుదముట్టించడానికి మంచి శక్తులన్నీకలసి ఎంతో పోరాటం చేస్తేనే ఫలితం వస్తుందని చరిత్ర చెబుతోంది.
జీహెచ్ఎంసీ మేయర్ పదవిని ఇతర పార్టీలకు కట్టబెడితే భూమి తలకిందులైపోతుందని, అభివృద్ధి ఆగిపోతుందని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, మతకల్లోలాలు జరిగిపోతాయని కేసీఆర్ అరిచి గీపెడుతున్నారు. సీఎం దొరగారు ఏ పార్టీలను ఉద్దేశించి ఇలా అన్నారో గానీ, ఆయన మాటలే గనుక నిజమైతే… దేశంలోని అనేక రాష్ట్రాల్లో వరుసగా పలుమార్లు ఇప్పుడున్నజాతీయ పార్టీలు విజయాలు సాధించాయి. మరి అక్కడ అభివృద్ధి జరగడం వల్లే తిరిగి ప్రజలు ఆ పార్టీలకు పట్టం కడుతున్నారు. కేసీఆర్ కుటుంబం చెబుతున్న విధంగా అరాచక పాలన జరిగితే దేశంలోని ఆ రాష్ట్రాల్లో ఆ పార్టీలకు తిరిగి తిరిగి అధికారం ఎలా దక్కుతుంది? ఇటీవలే బీజేపీలో చేరిన విజయశాంతి సీఎం కేసీఆర్పై పలు ప్రశ్నలు సంధించడం విశేషం.