కాశ్మీర్లోని రాజౌరీ జిల్లా సుందర్బనీ సెక్టార్లో గురువారం అర్ధరాత్రి ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ జశ్వంత్రెడ్డి (23) అంత్యక్రియలు ముగిశాయి.
గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాదకొత్తపాలెంలో తండ్రి శ్రీనివాస్రెడ్డి జశ్వంత్రెడ్డి మృతదేహానికి చితి అంటించారు. గౌరవ సూచికంగా సైనికులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు.
జశ్వంత్రెడ్డి అమర్రహే అంటూ ప్రజలు నినాదాలు చేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోం మంత్రి సుచరిత, ఉపసభాపతి కూన రఘుపతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సీఎం జగన్ ప్రకటించిన రూ.50 లక్షల సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. అంత్యక్రియల్లో భారీ ఎత్తున జనం పాల్గొని ‘జై జవాన్’ అంటూ నినాదాలు చేశారు.
జశ్వంత్రెడ్డి పార్థివదేహాన్ని శుక్రవారం ప్రత్యేక విమానంలో హకీంపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్కు తీసుకువచ్చారు.
సీనియర్ మిలిటరీ, ఎయిర్ఫోర్స్, సివిల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు నివాళులర్పించిన అనంతరం స్వగ్రామానికి తరలించారు.