భారీ వర్షాలతో సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లోని పలు మండలాల్లో చెరువులు మత్తళ్లు దూకడంతో నీరంతా మోయతుమ్మెద వాగులో చేరి ఎల్ఎండీ రిజర్వాయర్ లోకి ప్రవహిస్తోంది. కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎల్ఎండీ రిజర్వాయర్ లోకి నీరు భారీగా వచ్చి చేరుతుంది.
భారీ వర్షాలతో గ్రామాలు నీట మునిగి పోతున్నాయి. చెరువులు, కుంటలు నిండి పొంగి పొర్లుతూ వాగుల్లోకి చేరి ప్రవహిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎల్ఎండీ రిజర్వాయర్ లో నీటి మట్టం రోజురోజుకు పెరుగుతుంది.
ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్లగొండ లోని పలు ప్రాంతాలకు సాగునీటిని అందించే ఎల్ఎండీ రిజర్వాయర్ సగానికి చేరుకుంది. మోయతుమ్మద వాగు ద్వారా సుమారు యాభై వేలు క్యూసెక్కుల నీరు ఎల్ఎండీ రిజర్వాయర్ లోకి వచ్చి చేరుతుంది.
24 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఎల్ఎండీ రిజర్వాయర్ శనివారం సాయంత్రం వరకు 12 టీఎంసీలకు చేరుకుంది. మూడు రోజుల క్రితం 9.47 టీఎంసీల నీరున్న ఎల్ఎండీ రిజర్వాయర్ లోకి రెండున్నర టీఎంసీల నీరు మూడు రోజుల్లో వచ్చి చేరింది. నీటి ప్రవాహం ఇలాగే ఉంటే రోజుకు ఒక టీఎంసీ చొప్పున ఎల్ఎండీకి నీరు వచ్చి చేరుతుందని ఎస్ఈ శివకుమార్ తెలిపారు.
ఈఈ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏఈలు ప్రతీ గంటకోసారి నీటి నిల్వలను పరిశీలిస్తూ సీఎంవో ఆఫీసుకు తెలియజేస్తున్నట్లు ఆయన చెప్పారు. వర్షాల కారణంగా ఎల్ఎండీ దిగువ ఆయకట్టు రైతుల కోరిక మేరకు నీటి విడుదలను నిలిపివేసినట్లు పేర్కొన్నారు.