గుంటూరు జిల్లా మంగళగిరి బైపాస్ రోడ్లోని తెనాలి ఫ్లైఓవర్ బ్రిడ్జిపై మందుబాబుల ఆగడాలు, యువకుల వీరంగాలతో అటు ప్రజలు, ఇటు వాహనచోదకులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
రాత్రి సమయాల్లో మందుబాబులకు, ఆకతాయి యువకులకు బ్రిడ్జి ఒక వేదికగా మారిపోయింది. మద్యం తాగి ఖాళీబాటిల్స్ బ్రిడ్జిపై పడవేయడం, కొంతమంది మద్యం మత్తులో బాటిల్స్ ను బ్రిడ్జి కింద విసిరి వేయడంతో కొన్ని బ్రిడ్జి కింద వెళ్లే వాహనాల మీద పడటం, మరికొన్ని రోడ్డుపై పడటం జరుగుతుంది.
దీంతో రోడ్డుపై పడవేసిన బాటిల్స్ సీసా పెంకులు వల్ల కొన్ని వాహనాలు పంచర్లు పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దీనికితోడు అర్ధరాత్రి సమయాల్లో యువకులు బ్రిడ్జిపై బర్తడే వేడుకలు చేసుకుంటూ వీరంగం సృష్టిస్తున్నారు. గతంలో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టడంతో సమస్య కొంత మేర తగ్గింది.
అయితే ఇటీవల పోలీసుల నిఘా తగ్గడంతో సమస్య పునరావృతం కావడంతో మందుబాబుల ఆగడాలకు, యువకుల వీరంగాలకు అడ్డు లేకుండా పోతుంది. దీనివలన బ్రిడ్జిపై వాకింగ్ చేసే వాకర్స్, బ్రిడ్జికి తూర్పు వైపున ఉన్న శ్రీశైలం నగర్ వాసులు పట్టణంలోకి వచ్చేటప్పుడు ఆ నగరవాసులు పడే బాధలు వర్ణనాతీతం.
కావున పోలీస్ అధికారులు మందుబాబుల ఆగడాలను, యువకుల వీరంగానికి కట్టడి చేయాలని వాకర్స్, ప్రజలు కోరుతున్నారు.