సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కోర్టు ఎదురు సందులో ఉన్న దుకాణాలను, ఇండ్లను తొలిగించేందుకు మున్సిపాల్టీ సిబ్బంది ప్రయత్నించగా దుకాణం, ఇంటి యజమానులు అడ్డుకున్నారు.
ఎన్నో సంవత్సరాలుగా దుకాణాలు,ఇండ్లు ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నామని వారు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తానన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకపోగా ఉన్న ఇండ్లు తొలగించటం ఇదెక్కడి న్యాయమని వాపోయారు.
ఎన్నికల ముందు తెరాస నేతలు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలం అయ్యారని అన్నారు. తమ దుకాణాలను, ఇండ్లను తొలిగిస్తే ఆత్మహత్యలకు పాల్పడుతామని హెచ్చరించారు. తమకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసిన తర్వాతనే తొలిగించాలని డిమాండ్ చేశారు.
వీరికి మద్దతుగా జిల్లా బి.జె.పి అధ్యక్షుడు బోబ్బా భాగ్యరెడ్డి, సి.ఐ.టి.యూ జిల్లా నాయకుడు శీతల రోషపతి మాట్లాడుతూ రెక్కాడితే డొక్క నిండని పేదలకు ప్రభుత్వ పరంగా నెలవు చూపాలని, అప్పుడే వారిని ఖాళీ చేయించాలని అన్నారు.
టి.డి.పి పట్టణ అధ్యక్షుడు తండు సాయిరాం గౌడ్, పట్టణంలోని పలు సంఘాల నాయకులు గృహ,దుకాణదారులకు మద్దతు పలికారు.