లాక్ డౌన్ కఠిన అమలులో భాగంగా మరిన్ని కీలక చర్యలు తీసుకుంటున్నామని డిఐజి ఏ.వి. రంగనాధ్ చెప్పారు.
కరోనా వ్యాప్తి నియంత్రణ, కేసుల సంఖ్య పెరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ఐడి కార్డుతో పాటుగా విధిగా ఉదయం 10-00 గంటల లోగా కార్యాలయానికి చేరుకోవాలని సూచించారు.
అదే విధంగా సాయంత్రం 5-00 నుండి 6-00 గంటల సమయం వరకు ఇంటికి చేరుకోవాలన్నారు. మీడియా ప్రతినిధులకు మినహాయింపు ఉన్నప్పటికీ విధిగా వారి అక్రిడిటేషన్ కార్డులు, సంస్థ జారీ చేసిన ఐడి కార్డులు వేసుకొని కవరేజ్ చేయాలన్నారు.
విద్యుత్ శాఖ, అత్యవసర సేవల విభాగాలు, లాక్ డౌన్ నుండి మినహాయింపు ఇవ్వబడిన శాఖల వారు వారి వాహనాలకు ముందు స్టిక్కరింగ్ చేసుకోవాలని, వారి ఐడి కార్డులు వెంట ఉంచుకోవాలన్నారు వ్యవసాయ రంగ కార్మికులు, వ్యవసాయ ఉత్పత్తులు ఉదయం 10.00 లోగా పనుల్లోకి వెళ్లి తిరిగి రాత్రి 9.00 కల్లా ఇండ్లకు చేరుకునేందుకు అనుమతిస్తామని చెప్పారు.
డాక్టర్లు, మెడికల్ సిబ్బంది, వైద్య విభాగంలో పని చేసే ఉద్యోగులు వారి ఐడి కార్డులతో పాటు వాహనాలకు స్టిక్కరింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అదే విధంగా మెడికల్ ఏజెన్సీల నుండి మెడికల్ షాపులకు ఔషధాల సరఫరా రాత్రి 7.00 నుండి ఉదయం 9.00 వరకు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు.
అదే విధంగా ఈ కామర్స్ విభాగానికి చెందిన స్విగ్గి, జోమాటో, రిలయన్స్, హెరిటేజ్ సిబ్బంది విధిగా వారి బ్రాండ్స్ తో కూడిన యూనిఫామ్, ఐడి కార్డు, వెహికిల్ స్టిక్కర్ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
గూడ్స్ వాహనాలు రాత్రి 9.00 నుండి ఉదయం 8.00 వరకు మాత్రమే అనుమతిస్తామని ఆ సమయంలోనే నిత్యావసరాలు, ఇతర సరుకుల రవాణా చేయాలని డిఐజి రంగనాధ్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ కఠిన అమలులో భాగంగా తీసుకుంటున్న చర్యలకు అందరూ సహకరించాలన్నారు.