ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ న్యాయస్థానాలలో శనివారంనాడు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు న్యాయ సేవాధికార సంస్థ తెలిపింది. జిల్లా కోర్టులలో, నర్సంపేట, ములుగు, మహబూబాబాద్, జనగామ, పరకాల, తొర్రూరు కోర్టులలో లోక్ అదాలత్ నిర్వహిస్తారు.
కరోనా జాగ్రత్తలు పాటిస్తూ, నేరుగా కోర్టు ప్రాంగణంలో లేదా వర్చువల్ సమావేశం ద్వారా గానీ కేసులు పరిష్కరించే విధంగా అన్ని సౌకర్యాలను కల్పించారు. కనుక కక్షిదారులు తమ వీలునుబట్టి తమ కేసులను రాజీ కుదుర్చుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తెలిపింది.
ఈ జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడే వీలు ఉన్న క్రిమినల్, సివిల్ కేసులు భూ తగాదాల కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ, కుటుంబ తగాదా కేసులు, బ్యాంకు, చెక్ బౌన్స్, ఎలక్ట్రిసిటీ, చిట్ ఫండ్, ఇన్సూరెన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, విద్యుత్ చోరీ ప్రీ- లిటిగేషన్ కేసులు, ఇతర రాజీపడదగు కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు.
ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ లో గుర్తించబడిన కేసులలో మొత్తం 1447 పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వారు తెలిపారు. వీటిలో ఇప్పటివరకు సుమారు 1200 కేసులలోని కక్షిదారులకు నోటీసులు జారీ చేసి రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వీటిలో క్రిమినల్-1119, ఎన్.ఐ. యాక్ట్-92, బ్యాంక్ రికవరీ-02, ఎం.ఎ.సి.టి. 108 వివాహ సంబంధిత-31, ల్యాండ్ ఆక్విజిషన్-4, ఆదర్ సివిల్-91 (EP-54, Decl-05,Money-20, P.Inj.-08, Title:04) ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ కేసులను పరిష్కరించేందుకు జిల్లా వ్యాప్తంగా సుమారు 25 బెంచీలు, వరంగల్ లో12, నర్సంపేట -1, పరకాల -2, జనగామ-4, మహబూబాబాద్-3, ములుగు -2, తొర్రూరు-1 బెంచీలను ఏర్పాటు చేస్తున్నారు.