ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు. ప్రభుత్వం పట్టుదలకు పోయి ఈ సమయంలో స్కూల్స్ ప్రారంభించడం పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని ఆయన అన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ఏపీలో థర్డ్ వేవ్ ఉదృతమవుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని ఆయన కోరారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయని ఆయన గుర్తు చేశారు. పక్కనున్న తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూల్స్ కి సెలవులు ప్రకటించాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్కూల్స్ కి సెలవులు పొడిగిస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చెయ్యాలని ఆయన కోరారు. 15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదని ఆయన గుర్తు చేశారు. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు,టీచర్ల ప్రాణాలతో చెలగాటమాడోద్దని ఆయన అన్నారు.
previous post