రాయలసీమలో విజయవంతంగా సాగిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటి నుంచి కోస్తా ఆంధ్రాలోకి ప్రవేశించింది. మహోద్యమంగా సాగిన యువగళం పాదయాత్ర రాయలసీమలో చరిత్ర సృష్టించింది. నారా లోకేష్ రాయలసీమలో 124రోజులపాటు 44 అసెంబ్లీ నియోజకర్గాలు, 108 మండలాలు, 943 గ్రామాల మీదుగా 1587.7 కి.మీ. మేర పాదయాత్ర సాగించారు. 124రోజుల సుదీర్ఘ పాదయాత్రలో యువనేత లోకేష్ కు వివిధవర్గాల నుంచి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై 2,228 రాతపూర్వక వినతిపత్రాలు అందాయి. యువగళం పాదయాత్రలో సుమారు 20లక్షలమంది ప్రజలు భాగస్వాములయ్యారు. సీమ ప్రజల కష్టాలను దగ్గరగా చూసిన యువనేత లోకేష్ కడపలో మిషన్ రాయలసీమను ప్రకటించారు. అధికారంలోకి వచ్చన అయిదేళ్లలో మిషన్ రాయలసీమ ద్వారా సీమప్రజల కన్నీళ్లు తుడుస్తానని, అలాచేయని నాడు కడప నడిబొడ్డున నన్ను నిలదీయవచ్చని నారా లోకేష్ చెప్పారు.
రాయలసీమలో యువగళం పాదయాత్ర పూర్తయిన సందర్భంగా మిషన్ రాయలసీమకు తాను కట్టుబడి ఉన్నానని మరో మారు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ పూర్తి పాఠం:
రాష్ట్రంలో నాలుగేళ్ల అరాచకపాలనలో బాధితులుగా మారిన ప్రజలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా నేను చేపట్టిన యువగళం పాదయాత్ర తొలి మజిలీని మీ అందరి ఆశీస్సులతో విజయవంతంగా పూర్తి చేయగలిగాను. 124రోజులపాటు నిర్వహించిన సుదీర్ఘ పాదయాత్రలో నాతోపాటు యువగళం బృందాలను కంటికి రెక్కలా కాపాడుకుంటూ రాయలసీమ ప్రజలు మాపై చూపిన ఆదరాభిమానాలను జీవితంలో మరువలేను. అడుగడుగునా సీమ ప్రజల కష్టాలను నేరుగా చూశాక తీవ్ర మనోవేదనకు గురయ్యాను. రాయలసీమ బిడ్డగా ఈ ప్రాంతంలో నెలకొన్న సాగు, తాగునీరు, నిరుద్యోగం, వలసల నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్నాను. అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్ రాయలసీమ ద్వారా మీ కన్నీళ్లు తుడిచి రుణం తీర్చుకుంటానని యువగళం సాక్షిగా మాట ఇస్తున్నాను. ఎంతటి గడ్డు పరిస్థితుల్లోనైనా ప్రత్యర్థులకు ఎదురొడ్డి నిలబడే పోరాట స్ఫూర్తిని మీ నుంచి పొందిన నేను లక్ష్యాన్ని చేరుకునేవరకు విశ్రమించబోను.
మీ నారా లోకేష్,
(యువగళం పాదయాత్ర నుండి)