నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో 20 లోక్ సభ సీట్లు ఎలా వస్తాయో చెప్పాలని పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కోరారు. విషయం తెలియకుండా మాట్లాడిన హోం మంత్రి అమిత్ షా వివరణ ఇస్తే బాగుంటుందని ఆయన ఎద్దేవా చేశారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసిపి దోచుకున్నది నాలుగేళ్లు గా బీజేపీ కి కనపడలేదా అని రుద్రరాజు ప్రశ్నించారు. కేంద్రం ప్రభుత్వానికి సత్తా, సిగ్గు ఉంటే ముఖ్యమంత్రి జగన్ పై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
దేశం లో నెం 2గా ఉన్న అమిత్ షా ముఖ్యమంత్రి జగన్ పై అవినీతి ఆరోపణలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. హోం మంత్రి అయిన అమిత్ షా జగన్ అవినీతిపై సిబిఐ,ఈడి లతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పార్టీ బీజేపీ పార్టీ అని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పర్యటన లో నడ్డా ఒకటి, అమిత్ షా ఒకటి మాట్లాడుతున్నారని రుద్రరాజు అన్నారు.