ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత వీర విధేయులుగా నటించే నాయకులు ఆయన ఇచ్చిన పిలుపు మేరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మాత్రం నిర్వహించలేదు. అత్యంత విధేయత ప్రదర్శించే ఈ నాయకులే జగన్ మాటను పెడచెవిన పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
జగన్ కు వీర విధేయత ప్రకటించే కొడాలి నాని ఇటీవలె మంత్రి పదవి పోగొట్టుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని పని తీరు సరిగా లేదని సర్వేలో తేలింది. అదే విధంగా సీనియర్ నాయకుడు, మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి పొంది, ఆ తర్వాత జగన్ మాటే వేదవాక్కు అనే విధంగా ప్రవర్తించే ధర్మాన ప్రసాదరావు కూడా జగన్ ఆదేశాలను పాటించలేదు. ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకుని జగనన్న చెబితే ఏమైనా చేస్తాను అని బహిరంగంగా ప్రకటించే మంత్రి గుడివాడ అమర్ నాథ్ పని తీరు కూడా అతి తక్కువ స్థాయిలో ఉండటం గమనార్హం.
రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పని తీరు కూడా బాగాలేదని జగన్ సర్వేలో వెల్లడి అయింది. నియోజకవర్గాన్ని పట్టించుకోని వారిలో ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, మాజీ మంత్రి మేకతోటి సుచరిత, చెన్నకేశవ రెడ్డి, వాసుపల్లి గణేష్, ఉదయభాను, వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారు. మంత్రులు పినిపె విశ్వరూప్, ఆదిమూలపు సురేష్ ల పనితీరు కూడా బాగాలేదని వెల్లడి అయింది.