గిరిజన సంప్రదాయాల ప్రకారం జరిగే మహాజాతర రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నది. మేడారంలో జరిగే ఈ సమ్మక్క-సారలమ్మ జాతర లక్షలాది మంది భక్తులు వచ్చేందుకు వేదిక కాబోతున్నది. ఇప్పటికే కిటకిటలాడుతున్న మేడారం రేపటి నుంచి 8 వ తేదీ వరకూ ఇసుకేస్తే రాలనంతమంది జనంతో నిండిపోబోతున్నది.
ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో జరగనున్న ఈ కుంభమేళాకు తరలి వచ్చేందుకు భక్తజనం పోటెత్తుతున్నారు. ఇప్పటికే సమ్మక్క, సారలమ్మ దీక్ష తీసుకున్న భక్తులు మేడారానికి చేరుతున్నారు. పెళ్లి కొడుకు పగిడిద్దరాజును సమీప బర్లగుట్టపై నుంచి సోమవారం ఉదయం గుడికి తరలించారు. పగిడిద్ద రాజు ఆభరణాలను శుద్ధి చేసి పూజలు చేశారు. అక్కడి నుంచి తొట్టివాగు వద్ద ఉన్న గద్దెల వద్దకు పగిడిద్దరాజును తీసుకెళ్లి గద్దెలపై నిలిపి సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం పగిడిద్ద రాజు పడగలతో డోలీల చప్పుల్లతో కాలి నడకన మేడారానికి బయలుదేరారు. రేపు సమ్మక్క,గోవిందరాజుల రాకతో మొదలు కానున్న జాతర 8న వన ప్రవేశంతో ముగియనుంది. రేపు సారలమ్మ, పగిదిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. ఎల్లుండి (6న) సమ్మక్క గద్దె మీదకు చేరుతుంది.