మూడు రాజధానుల ఏర్పాటు కోసం రోడ్మ్యాప్ తయారవుతోందని, రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆయన కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ, విశాఖలో లక్షలాదిమందితో జరిగిన గర్జన సభను విజయవంతం చేయడం ద్వారా, మూడు రాజధానులపై ప్రజాభిప్రాయం తేటతెల్లమయ్యిందని అన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు తధ్యమని, విశాఖపట్నం పరిపాలనా రాజధాని అవుతుందని మంత్రి స్పష్టం చేశారు.
ఇప్పటివరకు ఫేక్ రైతులతో అమరావతి పాదయాత్ర జరిగిందని చెప్పారు. సుమారు 600 మంది రైతులకి కోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ, వారిలో కనీసం 60 మందికి కూడా గుర్తింపు కార్డులు లేవని అన్నారు. అది రైతుల ముసుగులో టిడిపి నాయకులు చేసిన పాదయాత్రగా పేర్కొన్నారు. అందుకే ఆ ఫేక్ పాదయాత్ర ఆగిపోయిందని అన్నారు. విశాఖ రాజధాని అయితే, ఉత్తరాంధ్ర బాగుపడుతుందని, దీనికి ప్రతీఒక్కరూ సహకరించాలని కోరారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి వచ్చే నెలలో ప్రధానమంత్రి చేత శంకుస్థాపన చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి బొత్స వెళ్లడించారు. మంత్రితోపాటు ఎంఎల్ఏ బొత్స అప్పలనరసయ్య కూడా ఉన్నారు.