ఏన్నో సంవత్సరాలకు గానూ మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి అని, ఈసారి వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశి శుక్రవారం (ఈ నెల 25న) వచ్చిందని అశ్వనీ నక్షత్రం ఉందని పంచాంగకర్తలు స్పష్టం చేస్తున్నారు. ముక్కోటి ఏకాదశిని మోక్షద ఏకాదశిగా పిలుస్తారు. ఇది సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి. చింతామణి వలే సమస్త కోర్కెలు తీర్చే, పాపాలను హరించి మోక్షాన్నిప్రసాదించే ఏకాదశి కావడం వల్ల దీన్నిమోక్షదశ అని కూడా అంటారు. మహా విష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల మంది దేవతలతో కలిసి (ముక్కోటి) భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తారు గనక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్టు అష్టాదశ పురాణాలు పేర్కొంటున్న విషయం తెలిసిందే.
ఉత్తర ద్వారా దర్శనంతో సకల శుభాలు
వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతిఒక్కరూ బ్రాహ్మి ముహూర్తంలో లేచి స్నానాదులు పూర్తిచేసుకోవాలని, కచ్చితంగా వైష్ణవ ఆలయాలు దర్శించాలని ముఖ్యంగా మహా విష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే మహా విష్ణువు అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు విష్ణువు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కచ్చితంగా కలుగుతుందని పేర్కొంటున్నాయి. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఎవరైతే మహా విష్ణువును పూజిస్తారో, ఆరాధిస్తారో, ఉత్తరద్వార దర్శనం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి.
నిష్ఠగా ఆచరిస్తేనే ఫలితం
ఉపవాసం అంటే.. కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటం కాదు. ఎల్లవేళలా భగవంతుడిని తలచుకుంటూ దగ్గరగా ఉండటమే ఉపవాసం. ఏకాదశి వ్రతం నిష్ఠగా ఆచరించేవారికి జ్ఞానం కలుగుతుంది. భగవత్తత్వంతో ఇదే తెలుస్తుంది. ప్రతి నెలలో రెండు ఏకాదశిలు వస్తాయి. ఏడాదికి 24 లేదా 26 ఏకాదశిలు వస్తాయి. ఏటా వచ్చే ఈ ఏకాదశిల్లో ముక్కోటి ఏకాదశి జ్ఞానప్రదమైనది. మోక్షప్రదమైనది. అత్యంత పవిత్రమైనది. ముక్కోటి ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించినట్టయితే విశేషమైన ఫలితం ఉంటుంది. ఏకాదశి తిథి యమప్రీతి. ద్వాదశి తిథి విష్ణుప్రీతి అని శాస్త్రం. భగవద్గీతలో కృష్ణపరమాత్ముడు వారాల్లో కెల్లా భానువారం (ఆదివారం). తిథులకెల్ల ఏకాదశి తిథి నేనే అని చెప్పడం విశేషం. దశమినాడు ఏకభుక్తము, ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు, ద్వాదశి నాడు అన్నసమారాధనం, ఏకభుక్తం ఈ నియమంతో ఏకాదశి వ్రతం చేస్తారని, ఇలా ఏకాదశి వ్రతం ఆచరించిన వాళ్లకు విష్ణు అనుగ్రహం కలిగి జ్ఞానం పొంది మోక్షం వైపు మార్గం ఏర్పడుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి.
ఇతిహాస పురాణం
సత్యయుగంలో ముర అనే అసురుడు ఉండేవాడు. బ్రహ్మదేవుడి ద్వారా వరం పొంది అనేక శక్తులు పొందుతాడు. ప్రజలు, విష్ణుభక్తులు, దేవతలను హింసించడం మొదలు పెట్టగా.. అతడి బాధలు తట్టుకోలేక దేవతలు, రుషులు కలిసి శ్రీ మహా విష్ణువును ప్రార్థించగా.. మహా విష్ణువు ముర అనే అసురుడితో యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధం వెయ్యి సంవత్సరాలు జరిగింది. ఈ యుద్ధంలో మహా విష్ణువు అలిసిపోతాడు. అలసట తీర్చుకునేందుకు విష్ణుమూర్తి గుహలో విశ్రాంతి తీసుకుంటాడు. విష్ణు మూర్తి విశ్రమించిన సమయంలో ఆయన్నుసంహరిద్దామని ముర అసురుడు ప్రయత్నిస్తాడు. విష్ణుమూర్తి శరీరం నుంచి మహా తేజస్సుతో కూడి ఉన్నయోగమాయ అనే కన్య ఉద్భవించి, ఆ రాక్షసుడిని సంహరిస్తుంది. ఆ కన్య పక్షంలో 11వ రోజు ఉద్భవించింది గనక ఆ కన్యకు ఏకాదశి అని నామకరణం చేశారు. నామకరణం చేసి తనకు ఇష్టమైన తిథి ఏకాదశి అని.. ఎవరైతే ఏకాదశి రోజు ఉపవాస దీక్ష చేస్తారో.. వారు సర్వవిధ పాపాలనుంచి విముక్తి పొందుతారని మహా విష్ణువు వరమిస్తాడు. అప్పటి నుంచి మానవుడు ఏకాదశి పర్వదినం అత్యంత వైభవోపేతంగా భక్తిశ్రద్ధలతో జరుపుతున్నారని పురాణాలు చెబుతున్నాయి.
ఆ రోజు ధాన్యంలోనే అసురుడు!!!
ఇలా కొంతకాలానికి ప్రజలు పాపాలు చేసి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఆ పాపాలు తొలగించుకోవడం చూసిన పాప పురుషుడు బాధపడి మహా విష్ణువును ఆశ్రయించాడు. అప్పుడు మహావిష్ణువు అతడికి నీవు ఎక్కడ ఉండాలో చెబుతాను. ఏకాదశి రాత్రి చంద్రోదయ సమయాన మూడు గ్రహాల కలయిక జరుగుతుందని ఆ రోజు రాత్రి ఎవరైతే ఆహారాన్నితీసుకుంటారో వారినే నువ్వు ఆశ్రయించాలని, ఎవరైతే ఆత్మోన్నతికి ప్రాధాన్యత ఇస్తారో వారు ఎలాంటి ధాన్యాలు భుజించరాదని, అన్నం, పప్పు ధాన్యాలు భుజించిన వారికి పాపపరిహారం ఉండదని మహా విష్ణువు తెలిపినట్టు ఏకాదశి వ్రత మహత్యం పేర్కొంటోంది. ఏకాదశి రోజున అన్నం, పప్పు ధాన్యాలు తీసుకోకుండా పాలు, పండ్లు చంద్రోదయానికి పూర్వమే తీసుకొని హరి నామస్మరణతో గడిపిన వారికి మహా విష్ణువు అనుగ్రహం కలిగి ఏకాదశి పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి.
వైకుంఠ ఏకాదశిన మనస్సును నిర్మలంగా ఉంచుకొని సత్యం, నిష్ఠ అనే నియామాలు పాటిస్తూ ఎవైరైతే నిర్మలమైన మనస్సుతో భగవంతున్నిధ్యానిస్తారో వారికే నిజమైన ఫలితం దక్కుతుందని ఆయా గ్రంథాలు పేర్కొంటున్నాయి.